ఇందు గలఁ డందు లేఁ డని…
ఇందు గలఁ డందు లేఁ డని…
జై శ్రీరామ్ జై హనుమాన్
ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.”
భావము:
ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!
ఇది అతిమధురమైన పద్యం. పోతనగారిది ప్రహ్లాద చరిత్రలోది. పదౌచిత్యం, సందర్భౌచిత్యం, పాత్రౌచిత్యం అందంగా అమరిన పద్యం. బాలుర నోట సున్నాముందున్న దకారం అందంగా పలుకుతుంది కదా (పద్యంలో చిక్కగా బొద్దుగా ఉన్నాయి). ప్రతి పదంలో రెండవ అక్షరాలకి సామ్యం ఉండాలన్నది అందమైన ప్రాస నియమం కదా. ఈ రెంటిన చక్కగా సమన్వయం చేసిన తీరు అద్భుతం. చిన్నపిల్లలు చేతులు కాళ్ళు కదుపుతు చెప్తున్నట్లు చెప్తారు కదా. అది పద్యం నడకలోనే స్ఫురిస్తున్న తీరు ఇంకా బావుంది. తనకే ఎదురు చెప్తాడా అన్న ఆగ్రహంతో ఊగిపోతున్నాడు తండ్రి హిరణ్యకశిపుడు. అంచేత ‘హరి హరి అంటున్నావు ఎక్కడున్నాడ్రా చూపగలవా?’ అంటు బెదిరిస్తున్నాడు తండ్రి. కొడుకు ప్రహ్లాదుడు నదురు బెదురులేని అయిదేళ్ళ పిల్లాడు. తన బాల్యానికి తగినట్లు అలా చిరునవ్వులతో నటనలు చేస్తూ ‘సర్వోపగతుడు శ్రీహరి’ అని సమాధానం చెప్పాడు. ఆ సందర్భానికి తగినట్లు పద్యం నడక సాగింది. పలుకుతున్న బాలకుడి పాత్రకు గంభీరమైన సున్నితమైన పదాలు ‘ఎందెందు’, ‘అందందు’ చక్కగా తగి ఉన్నాయి. మరి అప్పుడు ఆ పరమభక్తుని మాట బోటుపోనివ్వని నారాయణుడు నరసింహరూపంలో విశ్వమంతా వ్యాపించి సిద్ధంగానే ఉన్నాడట.
శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు
జై శ్రీమన్నారాయణ